టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మరో షాక్ ఇచ్చారు ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్. శుక్రవారం విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ఇటు అవంతి వర్గం.. అటు అప్పటికే పార్టీలో ఉన్న నేతలంతా ఒక్క చోట హాజరయ్యారు. మైక్ అందుకున్న వారంతా బాబు పాలనపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి.
మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఓట్లు వేసిన వారి భూములనే కబ్జా చేయించే ఘనాపాటి అంటూ విమర్శించారు అవంతి. కబ్జాల విషయంలో గంటాకు తన, మన బేధం ఉండదని.. స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారంటూ ఆరోపించారు. చంద్రబాబు పతనం ప్రారంభమైందని.. అవినీతి సొమ్ముతో ప్రజల ఓట్లను కొంటామన్న ధీమాతో చంద్రబాబు ఉన్నారని.. కానీ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఇక చంద్రబాబుపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదని.. అందుకే పార్టీని వదలడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు అవంతి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి మరికొన్ని రోజుల్లో 10 మంది కీలక నేతలు వైఎస్ఆర్సీపీలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నేతల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ఆ పది మంది నేతలు ఎవరై ఉంటారా? అన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది.
మరోవైపు పార్టీలో చేరే వారికి ఫిబ్రవరి చివరి వరకు జగన్ డెడ్లైన్ పెట్టినట్టుగా సమాచారం. అంటే చేరబోయేది ఎవరన్నది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే పార్టీని వీడుతారనుకుంటున్న నేతల సమాచారాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుని చంద్రబాబు పరిశీస్తున్నారని సమాచారం.