రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిచ్చు రేగుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటూ కొంచెం అధికార పార్టీ అయిన మిత్రపక్షానికి కొంచెం చురకలంటించే మాటలు అంటున్నారు. టీడీపీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తమపై విమర్శిస్తే వెంటనే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి టీడీపీతో కటిఫ్ చేసుకోవాలని ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆ విధంగా విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ తీరును తప్పుబట్టారు. టీడీపీపై పరోక్షంగా విమర్శలు చేయడంతో టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ స్పందించి విమర్శించాడు. దీనికి సోము వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రబాబును నమ్మి తాము నట్టేటా మునుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు లేనప్పుడే తమకు 18 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళ్లడం వలన 2004 ఎన్నికల్లో ఓడిపోయాం. ఇలాంటి నిర్ణయం చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని చరిత్రాత్మక తప్పు చేశామని చంద్రబాబు గతంలో చెప్పారు.
2014 లో బిజెపి దయాదాక్షిణ్యాలతోనే చంద్రబాబు అదికారంలోకి వచ్చారని చెప్పారు. అంతెందుకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తాము అన్ని చోట్ల పోటీచేస్తే గెలిచేదా అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ పెరగాలని ఆశించడమే తప్పా అని నిలదీశారు.
గతంలో వాజ్పేయి సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి చారిత్రక తప్పిదం జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబును నమ్మి వాజ్పేయి దెబ్బతిన్నారని పేర్కొన్నారు. తెలుగుదేశంతో పొత్తు లేనప్పుడే బీజేపీకి ఏపీలో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోతున్నారని వీర్రాజు చురకలు అంటించారు. ‘బీజేపీతో పొత్తు వద్దనుకుంటే చంద్రబాబు చెప్పాలి అని సవాల్ విసిరారు.