ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించింది. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి ఈ పరిశ్రమ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇదంతా తూచ్.. అసలు కియా పరిశ్రమ తరలిరావడానికి ప్రధాని నరేంద్ర మోదీనే ప్రధాన కారణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు.
ప్రచారం కోసమే చంద్రబాబు అబద్ధాలు చెబుతూ.. క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కియా పరిశ్రమ రావడానికి మోదీ కారణం కాదని మీరు పబ్లిక్ గా చెప్పగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు… కేంద్రం కృషిని హైజాక్ ‘కియా’! కియా పేరుతో అవినీతి ‘కియా’! కియా పేరుతో పబ్లిసిటీ ‘కియా’! కియా పేరుతో భూ-మాఫియా కు సపోర్ట్ ‘కియా’! అంటూ ఎద్దేవా చేశారు కన్నాలక్ష్మీ నారాయణ. అసలు మోదీ ప్రవేశపెట్టిన మెకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే కియా ఏపీకి వచ్చిందని బీజేపీ వాదన. అదే నిజమైతే బాబు చెవిలో పువ్వు పెట్టి మరీ.. పువ్వు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ పరిశ్రమను ఎగరేసుకుపోయేవని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.