ఏపీలో ప్రత్యేకహోదా అంశం ఉద్రుతంగా సాగుతోంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రత్యేకహోదాకు అనుకూలంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించడంతో టీడీపీకి భయం పట్టుకుంది. దీంతో చంద్రబాబునాయుడు ఎంపీలతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ప్రస్తుత సరిస్థితుల్లో ఎలా ముందుకెల్లాలని ఎంపీలతో బాబు చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జాతీయ స్థాయి పోరాటం నేపథ్యంలో కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామా చేయించాలని టీడీపీ ఎంపీలు సమావేశంలో బాబుకుసూచించారు.పదవులు పట్టుకుని కేంద్రంలో టీడీపీ మంత్రులు వేలాడుతున్నారని… ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారని… ఎంపీలు అధినేతతో చెప్పారట. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని కూడా గుర్తు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ కు రాజీనామా లేఖలు ఇస్తామని, రాజీనామా లేఖలు ఇప్పుడే ఇవ్వమన్నా ఇచ్చేస్తామని అశోక్ గజపతి రాజు అనగా, అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.
దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. కేంద్ర పదవుల్ని పట్టుకుని వేలాడే ప్రసక్తే లేదని… అలా ఎవరైనా భావిస్తే అది వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రాజీనామాలు అనేవి ఓ అస్త్రం మాత్రమేనని… ప్రస్తుతం దీనిని ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారట.
మరో వైపు విభజన హామీల విషయంలో నాలుగు దశలుగా పోరాటం చేద్దామని సూచించినట్లు తెలుస్తోంది. మొదటి దశలో లోక్సభలో… రెండో దశలో జాతీయ పార్టీలను కలుపుకుపోయి… మూడోసారి టీడీపీ కేంద్రమంత్రులు బయటకు రావడం… ఇక ఫైనల్గా ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకోవడమని టీడీపీ అధినేత చెప్పారట.