వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే సమాయాత్తమవుతున్నారు. మంగళవారం జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చంద్రబాబు. సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేతల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. తదుపరి ఎన్నికల్లో మొహమాటాలకు పోయి ఎవరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి తెచ్చుకోబోనని బాబు స్పష్టం చేశారు.
పదవుల వద్ద సాన్నిహిత్యాన్ని చూడబోనని, సన్నిహితులని భావిస్తే, ఇంటికి పిలిచి అన్నం పెడతానే తప్ప, టికెట్లు ఆఫర్ చేయబోనని స్పష్టం చేశారు. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై పదవులు రావని, అందరినీ కలుపుకుని, పేరు తెచ్చుకుంటేనే పదవులు వరిస్తాయని అన్నారు.
అన్ని నియోజకవర్గాల నుంచి కేవలం పార్టీ ఇస్తున్న సమాచారంపై మాత్రమే ఆధారపడటం లేదని, తనకున్న వివిధ మార్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని దాన్ని సమీక్షిస్తున్నానని, దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్లుగా నియమించిన మంత్రులు పనితీరుపై కూడా బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరిద్దరు తప్పా మిగతావాళ్లు ఏమాత్రం పనిచేయడం లేదని బాహటంగానే వ్యాఖ్యానించారు. అలాగే మహిళ మంత్రులు పరిటాల సునీత, భూమా అఖిలప్రియలకు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.
పార్టీ అధినేత ఖరాఖండిగా చెప్పేసరికి తెలుగుదేశం నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకూ తమకు తిరిగి పోటీ చేసే అవకాశం లభిస్తుందని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా బాబు వ్యాఖ్యలతో కలవరానికి గురవుతున్నట్లు సమాచారం. ఇకపోతే వైకాపా నుంచి వచ్చి ప్రతి ఎమ్మెల్యేకూ తదుపరి ఎన్నికల్లో అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.
అదే జరిగితే, ఆయా నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏంటని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేతలు తమ స్వరాన్ని ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అసంతృప్తనేతలందరూ జంప్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.