గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కమలం పార్టీ షాక్ ఇవ్వడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. దుబ్బాక ఓటమిని జీర్ణించుకోకముందే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా కారు జోరుకు బ్రేకులు పడటంతో పార్టీ పెద్దలు సైతం సైలెంట్ అయిపోయినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన ఓ సదావకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, ఐటీ మంత్రి కేటీఆర్ గానీ అందిపుచ్చుకోలేదు.
ఎలాగంటే.. హైదరాబాద్లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు బుధవారం హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్తో పాటు బయోలాజికల్–ఈ సంస్థలను సందర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాయబారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వారికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు రావటం అంటే మాటలా? అలాంటి అరుదైన అవకాశాన్ని కేసీఆర్, కేటీఆర్ సద్వినియోగం చేసుకోవాల్సిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
హైదరాబాద్ ఇమేజ్ భారీగా పెరిగేలా ప్రచారం చేసుకోవడం, అందులో తమకు రావాల్సిన ఇమేజ్ వాటాను సొంతం చేసుకుంటే బాగుండేదని అంటున్నారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా చేస్తామన్న తండ్రీ, తనయుల తాజా వైఖరితో అద్భుత అవకాశం చేజారినట్టేనని చెప్తున్నారు. విదేశీ రాయబారులు, హైకమిషనర్లను కలవకుండా కేంద్రం ఈ తరహా ప్లానింగ్ చేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.