మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బిజేపి సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల నవంబర్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తులసీరాం సిలావత్, గోవింద్ రాజ్పూత్లు ఘన విజయం సాధించడంతో వారికి అమాత్య పదవి కట్టబెడుతూ నిర్ణయించారు. రాజ్భవన్లో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో ఇద్దరు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేరికతో చౌహాన్ నేతృత్వంలోని మంత్రి మండలి సభ్యుల సంఖ్య 31కి చేరింది. చౌహాన్ మంత్రివర్గంలో ఇప్పటికే సింధియా వర్గీయులు 12 మంది మంత్రి పదవులు పొందారు.
ప్రస్తుతం మంత్రివర్గంలోకి వచ్చిన సిలావత్, రాజ్పూత్లు ఇద్దరూ గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ ఆ పార్టీకి రాజీనామా చేసి సింధియా నాయకత్వంలో భాజపాలో చేరారు. దీంతో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో.. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం నవంబర్లో 28 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా.. బిజేపి 19 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది.