విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హామీలపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో అఖిల పక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ, సీపీఎం తప్ప అన్ని పార్టీలనుంచి నాయకులు హాజరయ్యారు. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు భాజాపాను టార్గెట్ చేశాయి. కేంద్రంనుంచి వచ్చిన సాయంపై ఒక్కో పార్టీది ఒక్కో లెక్కతేలింది. జనసేన, టీడీపీ, వామపక్షాలు భాజాపాను టార్గెట్ చేయడంతో బిజెపి నేత ఐవైఆర్ విభేదించారు. పవన్ కళ్యాణ్ వేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఐవైఆర్ కూడా సభ్యుడిగా ఉన్నారంటూ మంత్రి నక్కా ఆనందబాబు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేసారు. అఖలి పక్ష సమావేశ అనంతరం ఉండవల్లి మాట్లాడారు.
ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు కొట్టుకు చచ్చినా రాష్ట్రం కోసం అన్ని రాజకీయా పార్టీలు కలసి పోరాడాల్సిందేనన్నారు. రాజ్యాంగ బద్దంగా రాష్ట్ర విభజన జరగలేదన్నారు. లోక్సభలో విభజన బిల్లుపై చర్చ జరగకుండానే ఒక గంటలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపారన్నారు. విభజన చట్టం అమలు విషయంలో, ఆర్ధికపరమైన అంశాల్లో టీడీపీ, బీజేపీలకు స్వల్ప విభేదాలున్నాయన్నారు.
అఖలపక్షసమావేశం కాంగ్రెస్ను, భాజాపాను నిందించడంకోసం కాదన్నారు. రాష్ట్రాలను విభజించే అంశంపై రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో స్పష్టంగా వివరించారన్నారు. కాని ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయా పార్టీలు ఎలా కొట్టకున్నా రాష్ట్ర విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.