ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికె కర్నూలు జిల్లాలో శిల్పా బ్రదర్స్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో మాజీ మంత్రి వైసీపీ గూటికి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని …జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాట్లు సమాచారం.
మాజీ మంత్రి కందుకూరు మాజీ శాసనసభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గూటికి చేరుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వైసీపీ జిల్లా అధ్యక్షుడుమాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలు పలించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మాత్రం ముందుగా జడ్పిటిసిలు ఎంపిపిలు సర్పంచ్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకుడుగా పేరున్న మానుగుంట అవసరం ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రతిసీటులో గెలుపుకీలకం కానుంది. ఇందులో భాగంగానే వైసీపీ గెలుపుగుర్రాల వేటలో పడింది
కందుకూరు నియోజకవర్గంలోని ఎంపీపీ జడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో తమపార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో బాలినేని ఉన్నారు. నియోజకవర్గంలో మానుగుంటకు మంచి పట్టుఉండటంతోపాటు వైసీపీకి అనుకూలంగా నియోజకవర్గం ఉండటంతో బాలినేని ఆయన చేరికపై ప్రత్యేక దృష్టిసారించారు.
ఇదిలా ఉండగా కందుకూరు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలుపొందిన పోతుల రామారావు తెలుగుదేశంపార్టీ గూటికి చేరారు. ఈ నేపధ్యంలో ఆ నియోజకవర్గంలో రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిగా తూమాటి మాధవరావు ఉన్నప్పటికీ పోతుల రామారావును ఎదుర్కొనే సత్తా లేదన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో పోతులను ఢీకొనాలంటే సమర్ధుడైన మానుగుంటను రంగంలోకి దించేందుకు బాలినేని పావులు కదిపారు. జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
