తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్త విషయంలో కుస్తీపడుతున్నారు. మరో వైపు టికెట్లు రాని నేతలను బుజ్జగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక కేసీఆర్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు బలమైన అభ్యర్తులను బరిలోకి దింపుతున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీకీ దిగుతున్నారు.
గులాబీ బాస్కు పోటీగా గజ్వేల్ నుండి తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రజా యుద్ద నౌక గద్దర్ ప్రకటించి సంచలనానికి తెరలేపారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజరికపు పాలన కొనసాగిందని గద్దర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్దరించబడాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తో భేటీ అయ్యారు గద్దర్. మొన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలసినప్పుడు 45 నిమిషాల పాటు పాటలు పాడి వినిపించానని తెలిపారు. ‘సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ’ పుస్తకం గురించి వివరించానని అన్నారు.
ఈ నెల 15 నుండి తెలంగాణలోని ప్రతి పల్లెకు వెళ్లి ప్రచారం నిర్వహించనున్నట్టు గద్దర్ ప్రకటించారు. అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా ప్రమాదకరమైందని గద్దర్ అభిప్రాయపడ్డారు. తన ప్రచారంలో భాగంగా… తొలి దశలో ఎస్టీ, రెండో దశలో ఎస్సీ, మూడో దశలో బీసీ, నాలుగో దశలో పేద ఓటర్ల వద్దకు వెళ్లి… వారిలో ఓటుపై చైతన్యం కల్పిస్తానని అన్నారు. తనకు రక్షణ కల్పించాలని ఢిల్లీలో సీఐడీ అడిషనల్ డీజీని కలిశానని తెలిపారు.
తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు. శాంతి చర్చల కోసం ఎందరినో కలిశానని…ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినైనా కలిసే అవకాశం ఉంటుందని అన్నారు. గజ్వేల్లో కేసీఆర్కు గెలుపు అంత సులభంగా దక్కేటట్టు కనిపించడంలేదు.