అధికార టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబక్కిరి చేస్తోంది కాంగ్రెస్. సీనియర్ నాయకులు పార్టీ మారుతున్నారంటూ గులాబీ బాస్ కేసీఆర్ను ఢిఫెన్సలో పడేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో… టీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాక్ ఇచ్చిన 24 గంటలు గడవక ముందే తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు పార్టీకీ రాజీనామా చేశారు.
తాజాగా మరో ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు హల్ చేస్తున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కారు దిగి, కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఐదు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. తాను పార్టీ మారబోవడం లేదని మీడియా ముఖంగా కొండా చెప్పినప్పటికీ… చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు. కొండా దారిలోనే మరో ముగ్గురు ఎంపీలు కూడా టీఆర్ఎస్ ను వీడటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.