తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు రూటు మార్చారు. ఇన్నాల్లు సైటెంట్గా ఉన్న ఈ సీనియర్నేత తమ పార్టీ అధినేతపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లిని దూరంగా పెట్టిన సంగతి తెలసిందే. మహానాడుకు కూడా ఆయనను ఆహ్వానించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోత్కుపల్లి తన ఆక్రోశాన్ని బయట పెట్టారు.
సొంత పార్టీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరంచంద్రబాబుపై మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు చేతులు కలిపితే… తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్ర చేశారని… అయితే, కేసీఆర్ తెలివైనవాడు కావడంతో చంద్రబాబు ప్రయత్నాన్ని అడ్డుకోగలిగారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏపీలో రథయాత్ర చేస్తానని తెలిపారు.
టీడీపీ బాగుండాలంటే ఎన్టీఆర్ వారసులకు పార్టీని అప్పగించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.