వైనాట్ 175 కాదు..వైనాట్ 200. ఇప్పుడు ఇదే వైసీపీ అధినేత జగన్ ప్రజలకు ఇస్తున్న పిలుపు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన జగన్..175 అసెంబ్లీ,25 ఎంపీ స్థానాలను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. తాను 130 సార్లు బటన్ నొక్కి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించానని, లబ్ధి పొందిన వారు ఎన్నికల్లో రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలని పిలుపునిచ్చారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్… ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమన్నారు. జగన్ ఒక్కడు ఒకవైపు ఉంటే, తోడేళ్లు గుంపుగా మన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.దేశంలో రూ.3వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు.
చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని నేత…. 2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. అయ్యిందా. డ్వాక్రా రుణమాఫి అని చెప్పి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఇంటింటికి ఓ ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పి ఏ హామీని నెరవేర్చలేదు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు అన్నారు.