గోదావరి జిల్లాల్లో వైసీపీకీ బలం పెరుగుతోంది. ఆ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పాదయాత్రలో అనేక చోట్ల ఇతర పార్టీల నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గోదావరి జిల్లాలో తెలుగుదేశంపార్టీకి షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత, జగ్గంపేట నియోజకవర్గం ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు వైసిపిలో చేరారు.
గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి జ్యోతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో అరంతర్గత కలహాల కారణంగా కొంతకాలంగా చంటిబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా పార్టీ నేతలు పట్టించుకోకపోవటంతో టిడిపికి రాజీనామా కూడా చేసేసారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతరుపున గెలిచిన జ్యోతుల నెహ్రు పార్టీ ఫిరాయించారు. అయితే జ్యోతుల నెహ్రు పునరాగమనంపై అసంతృప్తిగా ఉండటమే కాకుండా టీడీపీలో తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో ఆ పార్టీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు తన మద్దతుదారుల నిర్ణయం మేరకే వైఎస్ఆర్ సీపీలో చేరినట్లు జ్యోతుల చంటిబాబు తెలిపారు. పాదయాత్ర పూర్తయ్యోలోపు పార్టీలో మరిన్ని చేరికలు చోటుచేసుకోనున్నాయని పార్టీ నేతలు అంటున్నారు.