వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపుందుకున్నాయి. రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు చాలమంది పార్టీలో చేరారు.
తాజాగా కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ సహా వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జగన్ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన సండర్భంగా మాట్లాడుతూ అధికారంలోని వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని వసంత నాగేశ్వరరావు అన్నారు.
జగన్ పాదయాత్ర ఆరంభంలో పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. పాదయాత్ర ప్రారంభ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అయితే ప్రజాసంకల్పయాత్ర కోస్తాంధ్ర జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి జగన్ పార్టీలోకి నేతల వలసలు సాగుతుండటం గమనార్హం.