చంద్రబాబు విషయంలో ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారా..? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలు చేసిన ఆందోళనను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఏపి విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నట్లే కనబడుతోంది. ఏపికి ఇచ్చిన ప్రతిష్టాత్మక విద్యాసంస్ధలు, ప్రాజెక్టులు, నిధులపై 27 పేజీల నోట్ ను విడుదల చేసింది. అందులో మూడున్నరేళ్ళల్లో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిందంతా ఇచ్చిందని, చేయాల్సిందంతా చేస్తోందని కేంద్రం పేర్కొంది
కేంద్రం తాజా చర్యతో చంద్రబాబు బెదిరింపులకు, టిడిపి ఎంపిల ఆందోళనలను ఏమాత్రం ఖాతరు చేయటంలేదన్న విషయం స్పష్టమైపోయింది. ఆ విషయం చంద్రబాబు కూడా గ్రహించారు. అందుకే పచ్చమీడియాతో తనకు మద్దతుగా వార్తలు రాయించుకుంటున్నారు. ఎంపిలు ఎంత అరచి గీపెట్టినా ఇంతకుమించి ఇచ్చేది లేదు అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది.
చంద్రబాబేమో కేంద్రానికి మార్చి 5వ తేదీ వరకూ డెడ్ లైన్ విధించినట్లుగా పచ్చ మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. అయితే, మార్చి 5 వరకూ ఆగాల్సిన అవసరం లేదని కేంద్ర తన వైఖరిని స్పష్టం చేసింది. కేంద్రం తాజా చర్యతో బంతి చంద్రబాబు కోర్టులో పడింది. ఎన్డీఏలో నుండి వైదొలుగుతారా? తమ కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయిస్తారా? ఎంపిలందరినీ రాజానామాలు చేయాలని ఆదేశిస్తారా? అన్న నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబే.
చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రం లెక్కచేసేట్లు కనబడటం లేదు. ఎందుకంటే, ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తే నష్టపోయేది చంద్రబాబే కానీ బిజెపి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గనుక బయటకు వచ్చేస్తే వెంటనే ‘ఓటుకునోటు’ కేసులో కదలిక వచ్చిందంటే చంద్రబాబు సంగతి గోవిందా. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.