విశాఖలో రైల్వేజోన్ ఇస్తామని రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటించినా…ఇవ్వడంలేదని భాజాపాపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.
రైల్వే జోన్ ఏర్పాటుపై అధికారుల కమిటీ సంప్రదింపులు జరుపుతోందని… అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్రం తెలిపిందని చెప్పారు. సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లు ఆ సమయంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాఖలు చేసినట్టు ఆయన చెప్పారు. రైల్వేజోన్ ఇవ్వడం అనేది రాజకీయ నిర్ణయమని ఆయన చెప్పారు. రైల్వేజోన్కు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకొంటామని చెప్పినా కానీ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతలతో పాటు కొన్ని పత్రికలు కూడ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.