ఎండాకాలం ఏమోగాని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులక్రితం పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపనలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గతంలో సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న వారిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. కానీ ఓట్లు తొలగిస్తున్న వారిపై కాకుండా వారిని పట్టించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని కోటంరెడ్డి తెలిపారు. నిన్న రాత్రి నుంచి ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోటంరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు జిల్లా వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
విజయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడకు వచ్చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.భారీ బందోబస్తు నడుమ పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కాగా, తనను విడుదల చేసేవరకూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు.