మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, భాజాపాలు ఉప్పు, నిప్పులా ఉన్నాయి. గత కొద్దిరోజులగా విభజన హామీల అమలు విషయంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం మోదీ రాకతో అది మరింత స్థాయికి చేరుకుంది. మోదీ పర్యటనను విజయవంతం చేయాలని భాజాపా చూస్తుంటే….దాన్ని అడ్డు కొనేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి.
ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరు నగరానికి చేరుకోనున్న మోదీ.. ఏటుకూరు బైపాస్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి వాటి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖలో 1,178.35 కోట్లతో ఏర్పాటు చేసిన 1.33 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన చమురు నిల్వ కేంద్రాన్ని, ఓఎన్జీసీ ఆధ్వర్యంలో రూ.5, 300 కోట్ల అంచనా వ్యయంతో కేజీ బేసిన్లో ఏర్పాటు చేసిన గ్యాస్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని గుంటూరు సభ వేదిక నుంచే ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే కృష్ణపట్నంలో 100 ఎకరాలలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న చమురు సమీకరణ, నిల్వ పంపిణీ టెర్మినల్కు ఇదే వేదిక వద్ద ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
అయితే మోదీ పర్యటనను అడ్డుకొనేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం చంద్రబాబు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదని దుమ్మెత్తి పోస్తున్నారు. మరో వైపు విభజన చట్టంప్రకారం చాలా వరకు ఇచ్చిన హామీలను అమలు చేశామని భాజాపా చెప్తోంది.
అయితే మోదీ రాకతో బాబులో భయం పట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాల్లు కేంద్రంపై బాబు చేసిన విమర్శలకు ఆధారాలతో సహా బహిరంగ సభలో మోదీ వివరాలను వెల్లడిస్తారని భాజాపా నేతలు అంటున్నారు. దీంతో బాబు చేసినవన్నీ ఒట్టి ఆరోపనలేనని తేలనుంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే బాబు మోదీ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని భాజాపా నతేలు అంటున్నారు. మోదీ రాకతో బాబు బండారం బయట పడనుంది.ఇక పోతే రేపు మోదీ పర్యటనతో ఏజరగబోతోందనే ఆసక్తి నెలకొంది.