తెలంగాణలో రిజిస్ట్రేషన్లు మళ్లీ యథాతథంగా జరగనున్నాయి. సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగబోతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కార్డ్ సాఫ్ట్వేర్ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగనుంది. అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
కొత్త విధానం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొన్నాళ్ల పాటు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. కాగా ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారికి ఎంచుకున్న తేదీల్లో కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. అంతే కాదు ఇక నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు.