నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడే కొద్ది ప్రచారంతో వాతారనం వెడెక్కింది. వైసీపీ నుంచి జగన్… టీడిపీనుంచి మంత్రులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతిపక్ష పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటె… అధికారపార్టీలో మాత్రం కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇరు పార్టీలల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి.వలసలు వైసీపీకి ప్లస్ అయితే…. టీడిపీకి మైనస్ అవుతున్నాయి. బ్రహ్మానందరెడ్డి తరుపున ప్రచారానికి ముఖ్యనాయకులు డుమ్మాకొడుతన్నారు.
ఉప ఎన్నిక సమయంలో ఒక సమస్య పోతే మరో సమస్య టీడీపీ వెంటాడుతోంది. ఉపఎన్నిక వేళ కొత్త కొత్త వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పోటాపోటీగా జరుగుతున్న ఈ చేరికలతో పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను సంప్రదించకుండా కొత్త వారిని చేర్చుకోవడంపై తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈమధ్యనే నేషనల్ కాలేజీ అధినేత ఇంతియాజ్ అహ్మద్ను చేర్చుకోవడంపై కొందరు అలిగినట్లు తెలుస్తోంది. కనీసం తనను సంప్రదించకుండా పార్టీలో తీసుకోవడంపై రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఆయన బుధవారం ప్రచారానికి దూరంగా ఉన్నారు.
ఇంతియాజ్తో మొదటి నుంచి ఈయనకు పడదు. దీంతో రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి అఖిలప్రియ ప్రయత్నించారు. అయితే ఆయన ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దింపేందుకు పార్టీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాయబారానికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఆయన కూడా కొన్నిరోజులుగా తీవ్ర అసంతృప్తితో పార్టీ వ్యవహారాలు పట్టించుకోవడం లేదు. స్థానిక పరిస్థితులు తెలియకపోవడంతో మంత్రి అఖిలప్రియకు మైనస్గా మారింది. కొందరు పార్టీకి గుడ్బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.