నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు పాలనకు ఈ ఎన్నికలు రిఫరెండం అని.. ఒకపక్క వైసీపీ ప్రచారం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఈ ఉప ఎన్నికను చంద్రబాబు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఏకంగా మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్నంతా అక్కడే ఉంచి పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ఇదేసమయంలో కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజానాచౌదరి బాంబు పేల్చారు.
ఉప ఎన్నికలు టీడీపీ మూడేళ్ల పాలనకు రిఫరెండం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న నేతే ఇలా వ్యాఖ్యానించడంపై దుమారం రేగుతోంది. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనపై ప్రజలు ఇవ్వబోతున్న తీర్పునకు నంద్యాలే నాంది అంటూ జగన్ చెబుతూ వస్తున్నారు.
చంద్రబాబు సర్కారు చేసిన అభివృద్ధిని ప్రజలు మరోసారి గుర్తించడం ఇక్కడి నుంచే మొదలు అని టీడీపీ చెబుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల ఎన్నికల ఫలితాలపై ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా చాలా ఉప ఎన్నికలు వచ్చాయనీ, వాటిలో కొన్ని గెలిచామనీ, మరికొన్ని ఓడామని ఆయన చెప్పారు.
నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండమ్ కాదని ఉప ఎన్నికల కీలక దశలో సుజనా చెప్పడం ఇప్పుడు తెలుగుదేశంలో కలకలం సృష్టిస్తోంది. . ఒకవేళ నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండమ్ కాదని భావిస్తే అంతమంది నేతలను మోహరించాల్సిన అవసరమేముందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష వైసీపీకే అక్కడ అనుకూల వాతావరణం ఉందని పలు సర్వేల్లోనూ వైసీసీకే గెలిచే అవకాశాలున్నాయని తేలడం.. ఇప్పుడు సుజనా వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఓడిపోతామని తెలిసే.. టీడీపీ ఇటువంటి ప్రచారం మొదలుపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ వ్యాఖ్యలు ఎలాంటి దామారంలేపుతాయొ చూడాలి.