మంత్రులు అయ్యన్నపాత్రుడు…గంటా శ్రీనివాసరావుల మధ్య మళ్లీ రాజకీయ పోరు రాజుకోనుందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మొదటి నుంచి ఇద్దరి మద్య విబేధాలు ఉన్న సంగతి తెలసిందే. మంత్రులిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయని అనుకునేలోపు ఆర్టీసీ స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇప్పటి వరకు రాజకీయ వర్గపోరుతో కాలు దూసుకున్న ఇరు నేతలు ఇప్పుడు ఆర్టీసీ స్థలం విషయంలో తమ ప్రతాపం చూపించుకునేందుకు రెడీ అవుతున్నారు. అందుకు ఒక అడుగు ముందుకు వేశారు మంత్రి అయ్యన్నపాత్రుడు. విశాఖజిల్లాలో ఉన్న ఆర్టీసీ స్థలం జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించనని గొయ్యితీసి గోతిలో పాతిపెట్టేస్తానని మంత్రి అయ్యన్నపాత్రుడు వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ స్థలాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ డీవోటీ పద్దతిలో లీజుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంది. ఆర్టీసీ స్థలంలో మల్టీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని…నాలుగు సినిమాహాళ్లు, మూడు కళ్యాణ మండపాలు..ఇతర షాపింగ్ మాల్ లు కట్టాలని నిర్ణయించింది. అందుకు సంవత్సరానికి 40లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.
ఆర్టీసీ స్థలంలో మల్టీ కాంప్లెక్స్ ల నిర్మాణాల విషయం తెలుసుకున్న అయ్యన్పపాత్రుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. కాంప్లెక్స్ ల నిర్మాణానికి తాను అంగీకరించలేదని తేల్చిచెప్పారు. ఒక వేళ నిర్మాణాలు చేపడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఆర్టీసీ స్థలంలో జేసీబీలతో పనులు జరుగుతున్నట్లు తన దృష్టికి రావడంతో వెంటనే ఆర్టీసీ ఆర్ఎంకు, డీఎంకు ఫోన్ చేస్తే తమకేం తెలియదని చెప్తున్నారన్నారు. ఆర్టీసీ స్థలంలో జేసీబీలు పనిచేస్తే తగలబెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.
ఆర్టీసీ స్థలాన్ని పరిశీలించిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఆర్టీసీ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు వస్తే ఊరుకోనని హెచ్చరించారు. అధికారులు అని కూడా చూడకుండా గొయ్యి తీసి గోతిలో కప్పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అడ్డుగా నరికేస్తానంటూ ఘాటుగా చెప్పారు. మంత్రిపదవిని కూడా లెక్కచేయనని హెచ్చరించారు.