నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అంచనాలు తారుమారయ్యాయి. రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ అభ్యర్తి భూమా బ్రహ్మానందరెడ్డి 27,456 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్తి శిల్పా మోహన్రెడ్డిపై గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న ప్రతిపక్షపార్టీకి ప్రజలు దిమ్మతిరిగే శాక్ ఇచ్చారు. వైసీపీ ఓటమికి ఆ పార్టీనేతలు చేసిన స్వీయ తప్పులే వారి కొంపముంచాయనే వార్తలు భలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ పార్టీ అధినేత జగన్, రోజా చేసిన వ్యాఖ్యలే ఇలాంటి వ్యతిరేక ఫలితాలు రావడానకి ప్రధాన కారనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రధానంగా జగన్ ముఖ్యమంత్రిని కాల్చేస్తానంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకన్నా ఎక్కువగా.. రోజా మంత్రి అఖిల ప్రియపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయనె వార్తలు వినిపిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా చీరకట్టుకోకుండా, చుడీదార్లు వేసుకుని తిరగడమేంటి.?’ అంటూ మంత్రి అఖిల ప్రియపై నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కనీసం ఆ విమర్శల స్థాయిని తగ్గించి వుండాల్సింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆమె చుడీదార్ వేసుకుంటే నాకేంటి.? నైటీ వేసుకుని మంత్రి వర్గ సమావేశానికి వెళితే నాకేంటి.?’ అంటూ మరోసారి రోజా చెలరేగిపోయారు. దాంతో రోజా, మహిళా ఓటర్లను వైఎస్సార్సీపీకి దూరం చేసినట్లయ్యిందనే వాదనలూ లేకపోలేదు. రోజా కారణంగా వైఎస్సార్సీపీకి ఎంతో కొంత నష్టమైతే జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయి వున్నాం..’ అంటూ మంత్రి అఖిల ప్రియ, ఆమె సోదరి మౌనిక ఊరూవాడా చేసిన ప్రచారం, అదే సమయంలో రోజా ‘దిగజారుడు’ వ్యాఖ్యలు.. వెరసి, వైఎస్సార్సీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నది నిర్వివాదాంశం.
అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మాత్రం, జగన్ వ్యాఖ్యలుగానీ, రోజా వ్యాఖ్యలుగానీ నెగెటివ్ ఇంపాక్ట్ కలిగించాయని తాను అనుకోవడంలేదనీ, సెంటిమెంట్ బాగా పనిచేయడం, డబ్బు ప్రభావమే టీడీపీ గెలుపుకు కారణమని వ్యాఖ్యానిస్తుండడం కొసమెరుపు. ఏది ఏమైనా గాని నంద్యాల ఉప ఎన్నికను చూసి వైసీపీ కళ్ళు తెరవాల్సి ఉందనడంలో సందేహంలేదు.