దివంగత నటుడు,టీడీపీ మాజీ ఎంపీ హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కూకట్పల్లి నియోజిక వర్గం నుంచి ఆమె మహకూటమి అభ్యర్థిగా పోటీగా చేస్తున్నారు. సుహాసిని ఎన్నికలలో పోటీ చేయడం పట్ల నందమూరి హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ తమ మద్దతు ఎప్పుడు ఆమెకు ఉంటుందని తెలిపారు. ఇక హీరో నందమూరి తారకరత్న అక్క సుహాసిని తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు.అయితే ప్రచారంలో దూసుకుపోతున్న సుహాసినికి నారావారి కుటుంబం షాక్ ఇచ్చింది.
కూకట్పల్లిలో ప్రజా కూటమి తరఫున బరిలో ఉన్న తన మేనకోడలు నందమూరి సుహాసినికి మద్దతుగా తాను ప్రచారం చేయబోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, కొన్ని కారణాల వల్ల తాను ప్రచారానికి వెళ్లలేకపోతున్నానని, అయినప్పటికీ ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్న సుహాసిని విజయం సాధించి తీరుతుందని అన్నారు. సుహాసినికి మద్దతుగా అసంఖ్యాక తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని, తమ కుటుంబం నుంచి కూడా ఎంతో మంది క్షేత్రస్థాయిలో ఉన్నారని ఆమె అన్నారు.