పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.పాలమూరు జిల్లాకు ఈ దుస్థితి పట్టడానికి కారణం కాంగ్రెస్ నేతలేనని మండి పడ్డారు. సమైక్యాంధ్రలో పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు.
షాద్నగర్లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి, షాద్నగర్ మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, 1700 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
కేసీఆర్ పాలనను చూసిన ఆంధ్ర ప్రజలు… ఏపీలో కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణా అంధకారం అవుతుందని కొందరు తప్పుడు ప్రచారాలు చేశారని కాని…రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా పూర్వపు పాలమూరు, కొంత నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చేలా నాటి నిజాం రూపకల్పన చేశారని… ఆ సమయంలో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలపడం వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు మరో కోనసీమ అయి ఉండేదని చెప్పారు. కాంగ్రెస్ నేతల వల్లే పాలమూరు జిల్లా నాశనమయిందని మండిపడ్డారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు మరో కోనసీమ అయి ఉండేదన్నారు. పాలమూరు గోసకు గత పాలకులే కారణమని కేటీఆర్ మండిపడ్డారు.