తెలంగాణా టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరశింహులు బాబుపై నిప్పులు చెరిగారు. బాబు ఇంటి ముందు 15 సంవత్సరాలు కుక్కలా ఉన్నానని … తాను లేకపోతే ఆయన తిండి తినలేదని, నీళ్లు తాగలేదని, నిద్రపోలేదని… తనను బాగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తానన్నారని, గవర్నర్ పదవిని ఇప్పిస్తానని చెప్పారని… చివరకు పార్టీలో ఒక సభ్యుడిలా కూడా కొనసాగకుండా వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాల, మాదిగలంటే చిన్న చూపు ఉండే చంద్రబాబుకు చుక్కలు చూపించాలన్నదే తన అభిమతమని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒక మిత్రుడిగా సాయం చేయాలనుకుంటున్నానని తెలిపారు. జగన్ కు కూడా ఒక మిత్రుడిగా తనకు తోచిన సాయం చేస్తానని చెప్పారు. తాను తిరుపతికి వెళ్లినప్పుడు జగన్, పవన్ ల మనుషులు తన కోసం వచ్చారని తెలిపారు.
వివిధ పార్టీలకు చెందిన నేతలంతా ఏకమై, చంద్రబాబు అనే చీడ పురుగును ఏరి పారేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 35 సంవత్సరాల పాటు పార్టీ కోసం పని చేసిన తనను… అవమానకరంగా, గొంతు పిసికి రోడ్డుపై పడేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబును ఓడించేందుకు ఏపీకి సంబంధించి జగన్, పవన్, కిరణ్ కుమార్ రెడ్డిలను కూడా కలుస్తానని అన్నారు.
తాను ఏపార్టీలో చేరుతాననేది నిర్ణయించు కోలేదని..తనకు గౌరవాన్ని కాపాడే పార్టీలో చేరుతానని తెలిపారు. లేకుంటే తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు నుంచి ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని చెప్పారు. తాను ఎన్టీఆర్ శిష్యుడినని, ఒకరి మోచేతి నీళ్లు తాగి బతికే వాడిని కాదని అన్నారు.