అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీల్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీ గూటికి చేరనున్నారు. గత నెల 28న ఓ ఎయిర్పోర్టులో జగన్, అలీ కలుసుకోవడంతో అప్పటి నుంచి అలీ వైసీపీకి వెళ్తున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు.
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు అలీ. ఈనెల 9న ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో జగన్ పాదయాత్ర ముగుస్తుంది. ఇచ్చాపురం సభ వేదికగా జగన్ సమక్షంలో అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అదే విధంగా పార్టీ ఆదేశిస్తే పోటీకి కూడా తాను సిద్దమంటూ అలీ తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి అలీకి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఆ తర్వాత వ్యూహాత్మకంగానే వైసీపీకి దగ్గరయ్యారు. అలీ చేరికను వైసీపీ కూడా ధృవీకరించింది.
దివంగత సినీ నిర్మాత రామానాయుడు 1999లో బాపట్ల నుంచి టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీచేశారు. ఆ సమయంలో టీడీపీలో క్రీయాశీలకంగా ఉన్నారు అలీ. రామానాయుడుకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పవన్కు సన్నిహితుడిగా పేరున్న అలీ.. జనసేనలోకి కాకుండా వైసీపీలోకి చేరుతుండటంపై సినీ, రాజకీయ వర్గాలో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానమన్న బండ్ల గణేష్ కూడా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి జనసేన కార్యకర్తలను షాక్కు గురిచేశారు. ఇప్పుడు మరోమారు పవన్కు ఆప్తుడైన అలీ..పవన్ నిత్యం విమర్శించే జగన్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారా..? లేదా కేవలం ప్రచారానికే పరిమితమవుతారా..? అన్నది వేచి చూడాలి.