టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సొంత నియోజక సిరిసిల్లలో పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నియోజక వర్గ అభివృద్ధి చారానే మాత్రమేనని ఇంకా జరగాల్సింది బారానా ఉందని నాడు ఎన్నికల ప్రచార సమయంలో తాను చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ బారానా అభివృద్ధికూడా చేస్తామని ప్రకటించారు.
జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్ చొరువతో రాష్ట్రంలో విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని, తాగునీటి సమస్యకు తొంభై ఐదు శాతం పరిష్కరించుకున్నామని, ఇంకా ఐదు శాతం మిగిలి ఉందని, ఎండకాలం లోపు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. కులమతాలకు అతీతంగా కేసీఆర్ నాయకత్వాన్ని గౌరవించి, గుర్తించి దేశం అబ్బురపడే విధంగా 88 స్థానాలను కట్టబెట్టారు. కేసీఆర్ను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీ లేకుండా తృతీయ ప్రత్యామ్నాయాన్ని రూపొందించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం, అండ ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ను అజేయశక్తిగా, తిరుగులేని రాజకీయశక్తిగా మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.