ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ లు తగులుతున్నాయి.అప్పుడే ఆ పార్టీలో ఇంటిపోరు ముదిరి పాకాన పడుతోంది. జనసేనలో కీలకంగా ఉన్న ఇద్దరు బడానాయకులు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వారిద్దరినీ పవనే దూరంగా పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్న వ్యక్తి ఒకరు కాగా ఇటీవలే పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ఒక ఛానెల్ నే లీజుకు తీసుకున్న వ్యక్తి మరొకరు.పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో కానీ ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఒకరు లెఫ్ట్ సైడ్ మరోకరు రైట్ సైడ్ ఉండాల్సిందే. కాని ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు.
ఇంతకీ ఆ ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా ఇంకెవరు కొద్ది రోజుల క్రితం వరకు పవన్కళ్యాణ్ చుట్టూ తిరిగిన సీనియర్ నేతలు మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్లు. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులు. నిత్యం జనసేనాధిపతి పక్కన జనసైనికుల్లా నిలబడేవారు.
అయితే కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు పవన్ పక్కన కనిపించడం లేదు. అయితే వీరిద్దరిని పవన్ కళ్యాణ్ కావాలనే దూరం పెట్టారని ప్రచారం జరుగుతుంది. వారిపై పవన్ విశ్వాసం కోల్పోవడం వల్లే వారిని పార్టీకి దూరంగా ఉంచారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మాదాసు తనతో చర్చించకుండా సీట్ల కేటాయింపుల్లో వేలుపెడుతున్నారని కొందరికి సీట్లిస్తామంటూ హామీలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెల్లారంట. దాంతో పవన్ ఆయన్ని దూరంగా పెట్టారంట.
తోట చంద్రశేఖర్ హైదరాబాద్లోని ఓ హోటల్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి,సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారట. సీట్ల సర్దుబాటు విషయంలో తనదే ఫైనల్ అని విజయసాయికి చెప్పారంట. అదే విషయంపై పవన్ తో విజయసాయి చర్చించారంట. తాను అలాంటి ప్రతిపాదనే తీసుకురాలేదని విజయసాయిరెడ్డికి పవన్ వివరణ ఇచ్చారట. ఈ విషయం బహిర్గతమవ్వడంతో తోటపై ఆగ్రహం వ్యక్తం చేశారట పవన్ కళ్యాణ్. రేపో మాపో ఇద్దరు నేతలు వేరే పార్టీ మారడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.