తెలంగాణాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అందరి కంటె ముందుగానే అభ్యర్తులను ప్రకటించిన టీఆర్ ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తూ బహిరంగ సభలతో ఎన్నికలప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక హరీష్ రావు రూరల్ ఏరియాల్లో, కేటీఆర్ అర్బన్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే టీఆర్ ఎస్ ను మరో సారి అధికారంలోకి రాకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే మహాకూటమిని ఏర్పాటు చేసింది. తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ తరుపున లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకే వేదిక మీదనుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తారా అన్నది సస్పెన్స్ గా నేఉంది.
నందమూరి బాలకృష్ణ, విజయశాంతి 1990 దశకంలో వెండితెరపై వీరిద్దరిదీ ఎంత సూపర్ హిట్ జంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరు ఇరువురూ రెండు వేర్వేరు పార్టీల్లో కొనసాగారు. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రాములమ్మ ఇప్పుడు ఎన్నికల కదన రంగంలోకి దిగారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో జరిగే ఓ బహిరంగ సభలో వీరిద్దరూ కలసి పాల్గొంటారని తెలుస్తోంది. వచ్చే 40 రోజుల్లో 90 నియోజకవర్గాల్లో విజయశాంతి పర్యటనలు ఇప్పటికే ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ సైతం ప్రజల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్యను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. చాలా రోజుల తరువాత వీరిద్దరూ కలసి ఓ కూటమి తరఫున పనిచేయనుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహా కూటమిని అధికారంలోకి తీసుకొస్తారా అనేది చూడాలి.