వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది పుట్టిన రోజు వేడుకలు కూడా ప్రజాసంకల్పయాత్రలో ఘనంగా జరుపుకున్నారు. నేడు 47వ వడిలోకి అడుగుపెడుతున్నారు. తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత సొంత పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఎదిగిన జగన్కు ఇది స్పెషల్ బర్త్డే అనే చెప్పాలి. తండ్రి వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్లారు.
ఏడాది కాలంగా జనం మధ్యనే గడుపుతున్న జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి.జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్ పుట్టిన రోజును నిన్న అర్ధరాత్రి నుంచినే ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక ఆసుపత్రుల్లో, అనాథశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఈ రోజున వైకాపా వాళ్లు జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. మరో వైపు వైఎస్ జగన్ పుట్టిన రోజున ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు.
శుభాకాంక్షలు అని అభిమానులు చెబుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. శుక్రవారం జగన్ జైల్లో బర్త్డే జరుపుకుంటాడని టీడీపీ వర్గాలు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నాయి. అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం జగన్ ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరవుతుండటం.. అదే శుక్రవారం జగన్ బర్త్డే రావడంతో టీడీపీ వర్గాలు ఆయన్ను ఎద్దేవా చేస్తున్నాయి.
ఏదేమైనా రాబోయే సార్వత్రిక ఎన్నికలు జగన్కు అగ్ని పరీక్ష లాంటివే. గత 2014 ఎన్నికల్లోనే అధికారం దక్కుతుందని ఆశపడి భంగపడ్డ జగన్.. ఈసారి ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. పాదయాత్నును నమ్ముకున్న జగన్ను అధికారంలోకి తెస్తుందో లేదో చూడాలి.