నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మొదటినుంచి ఈ ఎన్నికను టీడీపీ ,వైసీపీలు చావో రేవో అన్నట్లుగా తీసుకున్నాయి. 2014లో ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడుకూడా గెలవాలని చూస్తున్న పార్టీకి అడగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి.
నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అక్కడ ప్రచారం ముమ్మరంగా ప్రారంభమైంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అక్కడే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. అయితే వైసీపీ రాంగ్ స్ట్రాటజీ తీసుకుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబును నడిరోడ్డుపై నరికి చంపాలంటూ జగన్ చేసిన కామెంట్ సంచలనం సృష్టించింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అంతటితో ఆగకుండా మరుసటి రోజే చంద్రబాబును ఉరితీసినా పాపం లేదని వ్యాఖ్యానించారు.
జగన్ దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజుకో హాట్ కామెంట్తో టీడీపీని టార్గెట్ చేసుకున్నారు. బాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో వివిరన ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివిరనపై ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగానే నంద్యాలలో వైసీపీ నేతలు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఆ పార్టీకి చెందిన 47 మంది కార్యకర్తలు, నేతలు డబ్బులు పంచుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమది విలువలతో కూడిన పార్టీ అని, ప్రలోభాలు పెట్టడం తమకు చేతకాదని చెప్తూ వస్తున్న వైసీపీ నేతలు తాజా డబ్బుల పంపిణీతో అడ్డంగా బుక్కయిపోయారు.
పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా వైసీపీ తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఏదైనా కచ్చితమైన సమాచారం ఉంటే తప్ప ఇలాంటి ఫిర్యాదులు చేయవద్దని వారు వైసీపీకి సూచించారు. ఇవన్నీ ఇప్పుడు వైసీపీ గెలుపుపై ప్రభావాన్ని చూపిస్తాయనె వార్తలు వినిపిస్తున్నాయి.