ఏపీలో ఇప్పుడు కాపుల రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని బాబు మాట తప్పారు. కానీ ప్రతిపక్షనేత జగన్ మాత్రం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం నాపరిధిలో లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎజెండా సెట్ చేశారు. రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎజెండా ఇచ్చారు.
ప్రత్యేక హోదాపై, విభజన హామీలపైనే కాకుండా అవినీతి ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన వేళ జగన్ అందరి దృష్టిని కాపు కోటాపైకి మళ్లించారు. రిజర్వేషన్లు తన చేతుల్లో ఉండదు కాబట్టి అమలు చేయలేనని, అందువల్ల ఆ హామీని ఇవ్వలేనని ఆయన చెప్పారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపులు వ్యతిరేకిస్తున్నా వెనక్కి తగ్గలేదు. టీడీపీ ఆపార్టీ అనుకూల మీడియా జగన్ కాపుల వ్యతిరేకి అని విమర్శలు గుప్పిస్తోంది. చివరకు కాపులను జగన్కు దూరం చేయాలనేది టీడీపీ ప్లాన్. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కోరిన తర్వాత తన పని అయిపోయిందని చంద్రబాబు అనుకున్నారు. కాని జగన్ చేసిన వ్యాఖ్యలతో సీన్ రివర్స్ అయ్యింది.
రిజర్వేషన్లు మొత్తం యాభై శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అందువల్ల జగన్ ప్రకటన చంద్రబాబును ఇప్పుడు ఏదో మేరకు చిక్కుల్లో పడేసినట్లే. కాపు సామాజిక వర్గం నేతగా తనపై ముద్రపడకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. తాను అన్ని వర్గాలకు చెందినవాడినని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అగత్యంలో పడ్డారు. దాంతో ఆయన నిపుణులతో చర్చలకు పూనుకున్నారు.
కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, మిగతా వర్గాలు పవన్ కల్యాణ్ కు దూరమయ్య ప్రమాదం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. వ్యతిరేకంగా తీసుకుంటే తనపై ఆశలు పెట్టుకున్న కాపు సామాజిక వర్గం ఎలా ప్రతిస్పందిస్తుందనేది తెలియదు. అందువల్ల పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడినట్లే చెప్పవచ్చు. జగన్ తెలివిగా బాబు , పవన్లకు ఎజెండా సెట్ చేశారనే చెప్పవచ్చు.