సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ,టీడీపీ రెండు పార్టీలలోను లుకలుకలు బయట పడుతున్నాయి. అధినాయకవత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోపాటు వారికి పోటీగా వేరే నేతలను ప్రోత్సహించడంతో ఇతర పార్టీల్లోకి వెల్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీనుంచి వైసీపీలోకి వలసలు కొనసాగితే ….తాజాగా వైసీపీనుంచి సీనియర్నేత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ కి షాక్ ఇస్తూ సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా నాయకులు పార్టీని వీడగా.. మరో సీనియర్ నేత శుక్రవారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఒక వైపు జగన్ పాదయాత్ర..మరో వైపు పార్టీని సీనియర్ నాయకులు వీడుతున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సీనియర్ నేత ద్వారపురెడ్డి శ్రీనివాసరావు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత అయినప్పటికీ.. పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
పార్టీ అధిష్టానంమీద అసంతృప్తితోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైసీపీలోని పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి అలజంగి జోగారావు వ్యవహార శైలి నచ్చక కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన చెప్పారు. తెలుగు దేశం నాయకులు, పార్టీలోకి రావాలని ఆహ్వానించారన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరాలని వారు కోరినట్టు చెప్పారు. ఉత్త రాంధ్రలో వైసీపీకి నష్టం కలగడంలో ఏమాత్రం సందేహంలేదు.