2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన జగన్ ప్రజాసంకత్పపాదయాత్ర చేస్తుంటే… మరో వైపు పార్టీనుంచి వలసలు మాత్రం ఆగడంలేదు. పాదయాత్ర పూర్తయ్యేలోపు వైసీపీనుంచి సీనియర్ నేతలను టీడీపీలోకి చేర్చుకోవాలన్న బాబు వ్యూహాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా విజయవాడకు చెందిన కీలక నేత టీడీపీ కండువా కప్పుకొనేదుందుకు ముహూర్తం ఖరారయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాపు సామాజికనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైపోయిందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనుండగా, ఆయన అక్కడి నుంచి రాగానే రాధ చేరిక ఉంటుందని టీడీపీ సీనియర్నేత ఒకరు వ్యాఖ్యానించారు.
రాధ చేరిక సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇంకా విషయం అధికారికంగా వెల్లడి కానందున, తన పేరును తెలిపేందుకు ఇష్టపడని ఆయన, వైకాపా నుంచి మరింత మంది నేతలు టీడీపీలోకి రానున్నారని, జగన్ వైఖరితో వారంతా విసిగిపోయి ఉన్నారని అన్నారు. రాధ చేరికతో కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని, ఆయనతో పాటు చాలా మంది స్థానిక నేతలు పార్టీ మారనున్నారని తెలిపారు.