తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసాలపై జరుగుతున్న దాడులతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సోదాలల్లో బయటపడుతున్న సొమ్ము రేవంత్దా లేకా చంద్రబాబు నాయుడిదాని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టగానే పచ్చ మీడియా ‘రేవంత్ పై పంజా’ ‘భావోద్వేగానికి లోనైన రేవంత్’ అంటూ సానుభూతి కథనాలను వండిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో డైరెక్టుగా దొరికిన దొంగను హీరోగా చూపడం వెనుక రహస్యం ఏంటని భూమన ప్రశ్నించారు.
కేవలం తమ నాయకుడిని కాపాడుకోవాలన్న కులగజ్జి కారణంగానే ఎల్లో మీడియా అనుకూల కథనాలను ప్రసారం చేసిందని భూమన అన్నారు. ఏపీ, తెలంగాణలో చట్టం, న్యాయం, రాజ్యాంగం అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులు చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
ఓట్లు కోట్లు కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి మతలబు ఏమిటని అన్నారు. నేరగాడైన మఖ్యమంత్రికి శిక్షలు ఉండవా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టానికి అతీతుడా అని ధ్వజమెత్తారు. అమెరికా వెళ్లి చంద్రబాబు అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నారనీ, చేయని పనులు తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు పాలనకు అంతిమ సమయం దగ్గర పడిందని జోష్యం చెప్పారు.