ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. బాబుకు చిన్న మెదుడు చితికిందని అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ జోన్, కడప ఉక్కు కర్మాగారాలు సహా అన్ని హామీలపై రోజుకో మాట మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడి, ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారని, స్వార్థ రాజకీయాలకు పాల్పడి రాయలసీమ అభివృద్ధిని అణగదొక్కుతున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం, వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామా తర్వాత బాబు యూటర్న్ తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాంట్రాక్టుల కోసం రాష్ట్ర భవిష్యత్ను మోదీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసు మాత్రమే వైఎస్ జగన్పై ఉందని, అక్రమాస్తులు చంద్రబాబు దగ్గరే ఉన్నాయని అన్నారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఆస్తులు ఎందుకు మోదీ జప్తు చేయలేదని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు నాయుడిని రాజీ చేశాం అని పార్లమెంటులో ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నీ స్వార్థం కోసం ప్రజల భవిష్యత్ తాకట్టు పెట్టి హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద పారిపోయి వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బుందేళ్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వకుండా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని సూటిగా అడిగారు.
తిరుమలలో జరుగుతున్న విషయాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతోనే సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీని తేవడానికి చంద్రబాబు అంగీకరించడం లేదని, ఈ విషయంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని రోజా తెలిపారు. దేవదేవుని సన్నిధిలో జరుగుతున్న అన్ని అంశాలూ పారదర్శకంగా ఉండాలని, భక్తులకు సమాచారం ఇచ్చేందుకు టీటీడీకి అభ్యంతరం ఎందుకని ఆమె ప్రశ్నించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని రోజా డిమాండ్ చేశారు