దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు వెలుగులోకొచ్చాయని, చంద్రబాబు నాయుడు వారిలో ఎవరినైనా పరామర్శించారా? అని ఆమె నిలదీశారు.
తాము చేస్తున్న పోరాటం వల్లే చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు దిగి వచ్చి కనీసం దాచేపల్లి బాలికను పరామర్శించారని రోజా చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బాధితురాలి బంధువులను తన పక్కన కూర్చోబెట్టుకుని మీడియాతో మాట్లాడారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి బాధితురాలి వివరాలు చెప్పకూడదన్న నిబంధనలు తెలియదా? అని రోజా ప్రశ్నించారు.
దాచేపల్లి ఘటనలో బాధితురాలి కుటుంబీకులను చంద్రబాబు మీడియా ముందుకు తీసుకురావడాన్ని రోజా తీవ్రంగా తప్పు పట్టింది. బాధిత కుటుంబాన్ని ఇలా రోడ్డు ఈడ్చడం, వారి చేత మాట్లాడించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం హేయమని రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు హయాంలో పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండటం మానేశారని, బాబు సభలకు జనాలను తరలించడం, తెలుగుదేశం నేత కబ్జా వ్యవహారాలను సెటిల్ చేయడమే పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సరిపోతోందని రోజా అన్నారు.