తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేయడంలో ఎప్పుడూ ముందుంటారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ సారి ఆయన ఓ కొత్త టాపిక్ను ఉదాహారణగా తీసుకొని చంద్రబాబు ప్రభుత్వం దుమ్ము దులిపేశారు. చంద్రబాబు పాలనలో ఏపీ నేరస్థులకు స్వర్గధామంగా మారిందన్నారు. అదేంటీ సంబంధం లేకుండా ఇప్పుడీ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారని అనుకుంటున్నారా?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు. హైదరాబాద్ లో జయరామ్ను హత్య చేసిన నిందితుడు రాకేశ్ రెడ్డి… ఆయన డెడ్ బాడీని మాత్రం కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ కారులో పడేసి వెళ్లిపోయాడు. అక్కడెక్కడో హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడవేయడానికి కారణమేంటని పరిశోధిస్తే.. ఏపీలో తనకు తెలిసిన ప్రభుత్వ పెద్దలు కాపాడుతారనే నమ్మకంతోనే రాకేష్ ఇలా చేశాడని తెలుస్తోంది.
ఇప్పుడీ విషయాన్నే తీసుకున్నారు విజయసాయి రెడ్డి. ఏపీలోని చంద్రబాబు సర్కారు… రాష్ట్రంలోని శాంతి భద్రతలపై పట్టు కోల్పోయిందని – ఈ కారణంగానే క్రిమినల్స్ కు ఏపీ సేఫ్ జోన్ గా మారిపోయిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బాబు జమానాలో ఏపీలో తిమ్మిని బమ్మిని చేయడం సులభమని …ఈ విషయాన్నే పసిగట్టిన రాకేశ్ రెడ్డి కేసు దర్యాప్తు ఏపీ పరిధిలోకి వచ్చేలా వ్యూహాత్మకంగా జయరామ్ మృతదేహాన్ని ఐతవరం వద్ద వదిలేసి వెళ్లాడని కూడా పేర్కొన్నారు.
ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపణలను సీరియస్గా తీసుకోవాలన్నారు విజయసాయి రెడ్డి. ఏపీ పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుందన్న విషయం ఇప్పటికైనా జనాలకు తెలిసిపోయిందన్న వాదనను వివరించే ప్రయత్నం చేశారు.