ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి టోపీ పెట్టేసింది. ప్రస్తుతం హోదాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. హోదాకు బదులు అందుకు సమానమైన ఆర్ధిక సాయం చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. కేంద్రం ఇచ్చే ఈ గోరంత దానికి కొండంత ప్రచారంతో ఊదరగొట్టాలని చూస్తోంది.
ప్రచారంతో ప్రజల మైండ్ సెట్ ను మార్చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ప్రచార సభలను నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. నెల రోజుల్లో ఏపీలో మూడు ప్రాంతాలలో కీలక సభలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా రాయలసీమ కోసం తిరుపతిలో ఒక సభ, ఉత్తరాంధ్ర వైజాగ్ లో మరో సభ, కోస్తా లో విజయవాడ గానీ, గుంటూరులో గానీ మరో సభతో.. మొత్తం మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని స్కెచ్ వేస్తోంది.
ఒక్కోక్క సభకు ఒక్కో కేంద్ర మంత్రిని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తోంది. అయితే అధికార ప్రభుత్వం ఈ సభలను సమర్ధిస్తున్నా..ప్రతి పక్షాలు, వామ పక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం కోసమే ఇలాంటి సభలను నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యా నాయుడుకి కూడా ప్రచారంపై ఉన్న ఇంట్రెస్ట్ ఏపీ పై లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా ఇలాంటి సభలకు ప్రజలు హజరవుతారా? కేంద్ర మంత్రులు ఏపీలో కాలు పెట్టగలరా? అని వాప పక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
Related