తమిళనాట జనం గుండెల్లోకి జయలలిత ఎంతగా చొచ్చుకుపోయారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తమిళనాడులో ప్రతి ఒక్కరు జయను తమ సొంత మనిషిఆ చూసుకుంటారు. కష్టాల్లో ఉన్న పేదజనం పట్ల జయలలిత స్పందించిన తీరు అక్కడి జనానికి ఆమెను మరింత దగ్గరచేసింది. అమ్మ సేవాగుణానికి నాగరత్న అనే ఓ లాయర్ జీవితాన్ని ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మైసూరు వీధుల్లో భిక్షాటన చేసుకునే స్థాయి నుంచి నేడు ఓ సామాజిక బాధ్యత కలిగిన న్యాయవాదిగా నాగరత్న(32) ఎదగడం వెనుక జయ అందించిన ఆపన్న హస్తం ఉంది.
చదువు అంటే ఆసక్తిని చూపించే నాగరత్నకు తల్లిదండ్రుల ఆర్థికస్థితి ఏమాత్రం సహకరించలేదు. దీంతో స్కూల్ కు వెళ్తూనే.. ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులతో కలిసి భిక్షాటనకు వెళ్లేది.2001లో 65శాతం మార్కులతో పదవతరగతి పాసైంది. అప్పటికీ ఓ సొంత గూడంటూ ఏదీ లేదు. వీధి లైట్ల కిందే చదుకోవడం.. అక్కడే నిద్రపోవడం.ఈ నేపథ్యంలోనే ఆమె ధీనావస్థను గమనించిన ఎక్స్ప్రెస్ దినపత్రిక ఆమెపై ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో విషయం కాస్త జయలలిత దృష్టికి వెళ్లింది. వెంటనే.. నాగరత్నను జయ పిలిపించి నాగరత్న కష్టాలను పెద్ద మనసుతో అర్థం చేసుకుంది. వెంటనే లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందజేశారు. అమ్మ చేసిన సహాయానికి నాగరత్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ సమయంలో నాగరత్న కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ముందుకెళ్లాల్సిందిగా జయలలిత ఆమెకు భరోసా ఇచ్చారు. అమ్మ అందించిన చేయూతతో ఎల్.ఎల్.బి పూర్తి చేసిన నాగరత్న ప్రస్తుతం సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తోంది. భిక్షాటన దశ నుంచి కోర్టులో లాయర్ దాకా సాగిన తన ప్రయాణంలో అమ్మ అందించిన సహాయం మరువలేనిది అని నాగరత్న చెబుతోంది. అమ్మను కలవాలని అనునకుంటున్న తరుణంలోనే.. ఆమె మరణవార్త వినాల్సి రావడం జీర్ణించుకోలేకపోతున్నానని నాగరత్న కన్నీటిపర్యంతమైంది. నాగరత్న లాగానే మరికొంతమందికి కూడా జయ ఆపన్న హస్తం అందించి ఉండవచ్చు. వారంతా ఇప్పుడు అమ్మ తమకు చేసిన సహాయాల్ని గుర్తుచేస్తుకుంటూ ఆవేదన చెందుతున్నారు.
Related