ఇప్పటి వరకు మనం 7 ఖండాలగురించె విన్నాం. ఇప్పుడు తాజాగా ఎనిమిదో ఖండం ఉందంటె నమ్ముతారా..ఇది నిజం. లక్షల సంవత్సరాల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఎనిమిదవ ఖండం జిలాండియా ఖండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు తొలిసారిగా దానిమీద పరిశోధన చేశారు. దీంతో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి.
వేల అడుగుల లోతులో ఉన్న జిలాండియాపై పాదం మోపిన శాస్త్రవేత్తలు దాదాపు 8 వేల శిలాజాలను కనుగొన్నారు. దానిపై ఉన్న జీవరాశి గురించి అన్వేషించేందుకు నిర్ణయించుకున్న ఓ శాస్త్రవేత్తల బృందం సాగర గర్భంలో వేల మీటర్ల లోతుకు వెళ్లింది. అక్కడ శవాల దిబ్బగా మారిన జిలాండియా శాస్త్రవేత్తల బృందానికి దర్శనమిచ్చింది. శాస్త్రవేత్తలు కలియతిరిగిన కొద్ది ప్రాంతంలోనే వేల సంఖ్యలో జీవరాశులు ప్రాణాలు విడిచి కనిపించాయి.
జిలాండియా మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. జిలాండియా నుంచి జంతువులు, మొక్కలకు సంబంధించిన శాంపిల్స్ను తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. పూర్వం జిలాండియాలో భౌగోళికంగా, వాతావరణపరంగా పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెప్పారు.
సుమారు 40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం పసిఫిక్ మహాసముద్ర గర్భంలో సంభవించిన ‘రింగ్ ఆఫ్ ఫైర్’.. అగ్నిపర్వతాల క్రీయాశీలత్వాన్ని, సముద్ర లోతును, జిలాండియా విస్తీర్ణంలో మార్పులు వచ్చేలా చేసిందని వెల్లడించారు. అప్పుడే ఆస్ట్రేలియా, అంటార్కిటికాల నుంచి జిలాండియా విడిపోయి ఉంటుందని వెల్లింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు ఒకరు చెప్పారు. భూమి చరిత్ర, న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లో పర్వతాల పుట్టుక, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పులు, సముద్రాలలో సంభవించే మార్పులు, ప్రపంచ వాతావరణంలో మార్పులపై పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.