ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంది? వైఎస్ రాజశేఖరరెడ్డికా? నారా చంద్రబాబునాయుడికా? ఆంద్రప్రదశ్ ప్రజలు ఎవరి పాలనను ఎక్కువ ఇష్టపడ్డారు? అలాగే ఎన్టీఆర్-చంద్రబాబుల్లో ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంది? జగన్-చంద్రబాబులలో ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంది? ఈ ప్రశ్నలకు సీమాంధ్ర జనాల్లో ఎక్కువ మంది సమాధానం ఏమై ఉంటుంది? మిగతా విషయాలను పక్కనపెడితే ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ల కంటే చంద్రబాబుకు ప్రజాదరణ తక్కువ అని మాత్రం టిడిపి నేతలు కూడా అంతర్గతంగా ఒప్పుకునే విషయమే. మరి ఎందుకుని ఎన్టీఆర్ లాంటి అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా చంద్రబాబు చేతిలో ఓడిపోయాడు? తన నుంచి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నవాళ్ళు తనపై చెప్పులు వేసినా; ఎన్టీఆర్కి విలువలు లేవు అని చంద్రబాబునాయుడే వ్యాఖ్యానించినా నిండు సభలో కన్నీళ్ళు పట్టుకోవడం మినహా ఏమీ చేయలేకపోయాడు? ఇక వైఎస్సార్ మరణం వెనకాల ఉన్న ఆరోపణలను పక్కన పెట్టేద్దాం. 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టిడిపి, కాంగ్రెస్లు లోపాయికారిగా కలిసి పోటీచేసినప్పటికీ కనీసం వాళ్ళకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేసిన జగన్ సాధారణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష చేసిన జగన్, దేశంలోని నాయకులు అందరినీ కలిసిన జగన్ని రెండు కళ్ళ సిద్ధాంతంతో, తెలంగాణాకు అనుకూలంగా లేఖ రాయడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఎందుకు ఇవ్వదు అని డిమాండ్ చేసిన చంద్రబాబు ఎలా ఓడించగలిగాడు? ఆ మేజిక్ మొత్తం కూడా చంద్రబాబు భజన మీడియా దగ్గర, రాజగురువుల దగ్గర ఉంది. ఇప్పుడు జగన్ పాదయాత్ర సమయంలో కూడా జగన్ పాదయాత్రను మీడియా పట్టించుకోవడం లేదని, జగన్ ఇంటర్యూలు కూడా కేవలం సాక్షి మీడియాలోనే వస్తున్నాయని పరిహాసం చేస్తున్నారు. సిగ్గులేకుండా వార్తలు ప్రచురిస్తున్నారు.
అసలు తెలుగు నాట ప్రజల పక్షాన మాట్లాడే మీడియా సంస్థ ఉందా? ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన క్షణం కూడా ఒక వర్గం మీడియా మొత్తానికి ప్రజాదరణ విషయంలో బలహీనుడైన చంద్రబాబును ప్రపంచస్థాయి నేతగా చూపించడానికే సరిపోయింది. ఇక ఇతర మీడియా సంస్థలన్నీ కూడా ఈ ఎల్లో మీడియాతో పోటీపడడానికే సరిపోయింది. సాధారణంగా మీడియా అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షం అని గొప్పగా చెప్తూ ఉంటారు. వైఎస్సార్ పాలనా కాలంలో ఇదే ఎల్లో మీడియా వైఎస్సార్పై విషం చిమ్ముతూ సాక్షిలా భజన చేయడం మాకు చేతకాదని బోలెడన్ని నీతులు చెప్తున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు జమనా వచ్చేసరికి ఆ నీతులు ఏమయ్యాయి? రుణమాఫీ హామీలు ఎందుకు అమలుచేయలేదు అని ఎల్లో మీడియా ఏనాడైనా ప్రశ్నించిందా? పోలవరం అవకతవకలపై మాట్లాడిందా? ప్రత్యేక హోదా, రైల్వే జోన్లాంటి విషయాల్లో మోడీకి ఎందుకు సాగిలపడ్డావ్ అని చంద్రబాబుని నిలదీశారా? ఓటకు కోట్లు కేసు తర్వాత నుంచి కేసీఆర్కి ఎందుకు భయపడుతున్నావ్? విభజన చట్టంలో అధికారికంగా సీమాంధ్రకు రావాల్సిన ప్రయోజనాలను కూడా ఎందుకు డిమాండ్ చేయడం లేదే అని ఏనాడైనా అడిగిందా ఈ ఎల్లో మీడియా? ప్రజల తరపున నిలబడడం మానేసి బాబు భజనలో తరిస్తూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు వార్తలు కూడా ఎప్పుడూ జగన్కి షాక్ అని చెప్పి వార్తలు రాయడమే కానీ ఒక్కసారన్నా అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు నైతిక విలువలకు పాతరేస్తున్న విధానాన్ని ప్రశ్నించిందా?
ఇప్పుడు అజ్ఙాత వాసి షూటింగ్ అయిపోయాక ఒక మూడు రోజుల షో కోసం ప్రజల మధ్యకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఎంతసేపూ జగన్ని విమర్శించడమే కానీ చంద్రబాబును మాత్రం విమర్శించడు. మీడియాతో సహా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులమని చెప్పుకునే నటులందరూ చంద్రబాబు భజనలో మునిగి తేలే బ్యాచ్ అయినప్పుడు ప్రజా సమస్యలపై నిలదీసేవాళ్ళు ఎవరుంటారు?
తెలుగునాట…..మరీ ముఖ్యంగా సీమాంద్రలో మీడియా మొత్తం కూడా బాబు భజనలో మునిగితేలుతున్నదన్నది నిజం. అలాంటి మీడియా జగన్ పాదయాత్రకు ఎందుకు కవరేజ్ ఇస్తుంది? జగన్ ఇంటర్యూలను ఎందుకు ప్రసారం చేస్తుంది? జగన్ పాదయాత్రను పట్టించుకోకపోగా ఆ పాదయాత్రను సాక్షి మీడియా తప్ప ఇంకే మీడియా సంస్థ కూడా పట్టించుకోవడం లేదని సిగ్గులేకుండా ఎద్దేవా చేయడం ఎల్లో మీడియాకే సాధ్యమైంది. అలా కాకుండా మేం జగన్ పాదయాత్రను పట్టించుకోం…..జగన్కి రాజకీయంగా కలిసొచ్చే ఏ వార్తనూ ప్రచురించం. జగన్కి నష్టం చేసే వార్తలే ప్రచురిస్తాం. బాబు భజన ఒక్కటే మాకు తెలిసన జర్నలిజం అని ఉంటే బాగుండేది. అయినా వెన్నుపోటు బ్యాచ్ ఎప్పుడైనా ఇలా స్ట్రెయిట్గా నిజాలు ఒప్పుకుంటారా? అంతా కూడా తెరవెనుక రాజకీయమేగా?