సాధారణంగా ఏ గేమ్లోనైనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం అనేది మైదానంలో మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్లు గొడవ పడిన ఘటన ఆసీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో చోటు చేసుకుంది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మొదటి టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆటగాళ్లు మైదానం విడిచి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే క్రమంలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది.
ఆటలో నాలుగో రోజైన ఆదివారం 417 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు.. బ్యాటింగ్ చేస్తుండగా మైదానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అనంతరం టీ విరామ సమయంలో ఇరు జట్లు డ్రెస్సింగ్ రూముకి వెళ్తుండగా.. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ డికాక్ని అసభ్య పదజాలంతో వార్నర్ దూషిస్తున్న తీరు సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. దీంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ తీరుపై విచారణ ప్రారంభించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 293/9తో నిలవగా.. విజయానికి ఆ జట్టు ఇంకా 124 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో డికాక్ (81 బ్యాటింగ్: 138 బంతుల్లో 11×4), మోర్నీ మోర్కెల్ (0 బ్యాటింగ్: 27 బంతుల్లో) మాత్రమే ఉన్నారు.
వాగ్వాదానికి కారణం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 39/2తో నిలిచిన దశలో ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రనౌటయ్యాడు. స్పిన్నర్ నాథన్ లియోన్ బౌలింగ్లో ఓపెనర్ మార్క్రమ్ బంతిని స్క్వైర్లెగ్ దిశగా నెట్టి పరుగు కోసం తొలుత నాన్స్ట్రైకర్ ఎండ్లోని ఏబీ డివిలియర్స్ని పిలిచాడు. దీనికి స్పందించి ఏబీ క్రీజు వదిలి సగం దూరం రాగా.. అప్పటికే వార్నర్ బంతిని సమీపిస్తుండటంతో.. కంగారు పడిన మార్క్రమ్.. ఏబీని వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించాడు. కానీ.. ఏబీ వేగంగా వెనక్కి వెళ్లేలోపు.. మెరుపు వేగంతో స్పందించిన వార్నర్.. బంతిని బౌలర్ నాథన్కి ఇవ్వడంతో.. డివిలియర్స్ (0) రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది.
