రియో ఒలింపిక్స్ వెండి పతక విజేత, తెలుగమ్మాయి పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న గోల్డ్ కోస్ట్-2018 కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకల్లో జాతీయ పతాకాన్ని పట్టుకొని భారత బృందానికి నాయకత్వం వహించే అవకాశం స్టార్ షట్లర్ సింధుకు లభించింది. చివరి మూడు కామన్వెల్త్ గేమ్స్ల తరువాత ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్ను ఫ్లాగ్ బేరర్గా సెలక్ట్ చేయడం ఇదే తొలిసారి.
టోర్నీలో భాగంగా ఏప్రిల్ 4న గోల్డ్ కోస్ట్లోని కరార స్టేడియంలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సింధు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. భారత జట్టులో స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్, మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో సింధు బ్రహ్మాండమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆమెను పతాకధారిగా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారి ఒకరు తెలిపారు.
2006లో మెల్బోర్న్ గేమ్స్ ఆరంభ వేడుకల్లో ఏథెన్స్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన షూటర్, ప్రస్తుత క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్ భారత బృంధానికి నాయకత్వం వహించారు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన గేమ్స్లో.. బీజింగ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా మార్చ్పాస్ట్లో పాల్గొన్నారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో.. లండన్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడలిస్ట్ షూటర్ విజయ్ కుమార్ ఈ ప్రత్యేక బాధ్యతను నిర్వర్తించాడు.