ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ వాట్సన్ సెంచరీతో కదం తొక్కారు. ఇక సురేష్ రైనా కూడా తనదైన శైలిలో బ్యాట్ను జులిపించడంతో చెన్నై సునాయాసంగా రాజస్థాన్పై చెన్నై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్కు నిర్ధేశించింది. తొలుత ఓపెనర్ షేన్ వాట్సన్ (106 : 57 బంతుల్లో 9×4, 6×6) మెరుపు శతకం బాదడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేయగా..రాజస్తాన్ రాయల్స్ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చెందింది.
రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్(45) రాణించగా, జాస్ బట్లర్(22) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్, తాహీర్లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత చెన్నైను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్ను అంబటి రాయుడు, షేన్ వాట్సన్లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్ కాగా, షేన్ వాట్సన్ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్ రైనా(46)తో కలిసి రెండో వికెట్కు 81 పరుగుల్ని జత చేశాడు.
చెన్నై 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే రైనా తర్వాత వాట్సన్ తన దూకుడును మరింత పెంచాడు. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిన వాట్సన్ రాయల్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఓపెనర్గా దిగిన వాట్సన్కు ఆరంభంలోనే రెండు లైఫ్లు లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకుని రాయల్స్కు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వాట్సన్ దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 106 పరుగులు చేసిన వాట్సన్ ఐదో వికెట్గా ఔటయ్యాడు.