ఇంగ్లండు గడ్డమీద టీమిండియా చెత్త ప్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చెత్త ఆట ఆడినందుకు విరాట్ కోహ్లి సేన అవమానాల్ని ఎదుర్కోవడంలో తప్పు లేదన్నాడు. 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ కు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాటు, అహంకారంతో టీమిండియా వచ్చిందని అన్నారు. భారత గడ్డపై ఆడినట్టు ఇక్కడ కూడా ఆడితే సరిపోతుందని టీమిండియా భావించిందని… ఇండియా ఘోర వైఫల్యానికి అదే కారణమని అన్నారు.
ఔట్ స్వింగ్ అవుతున్న బంతులను వెంటాడిన భారత బ్యాట్స్ మెన్ తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారని బాయ్ కాట్ అన్నారు. బ్యాట్స్ మెన్ వైఫల్యం వల్లే టీమిండియాకు వరుస ఓటములు ఎదురయ్యాయని చెప్పారు. కఠినమైన శ్రమతో మంచి ఫలితాలను రాబట్టవచ్చని… కానీ, కోహ్లీ టీమ్ ఆ పని చేయడం లేదని విమర్శించారు. టీమిండియా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందని చెప్పారు. డైలీ టెలిగ్రాఫ్ కు రాసిన కాలమ్ లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.