టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. భారత అండర్-19 జట్టు నాలుగోసారి ప్రపంచ కప్ ను గెలుచుకున్న కొన్ని రోజులకే వెంకటేష్ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ప్రసాద్ 30 నెలల పాటు నిర్వహించారు.
వెంకటేష్ ప్రసాద్ రాజీనామాపై బీసీసీఐ స్పందించింది. క్రికెట్ కు సంబంధించిన వేరే కార్యకలాపాలకు సమయం కేటాయించే నేపథ్యంలో వెంకటేష్ ప్రసాద్ రాజీనామా చేశారని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా తెలిపారు. అయితే, ఎలాంటి అసైన్ మెంట్ ను ఆయన చేపట్టబోతున్నారనే విషయాన్ని రాజీనామాలో పేర్కొనలేదని చెప్పారు.
వెంకటేష్ ప్రసాద్ కు ప్రత్యామ్నాయంగా ఎవర్ని తీసుకోవాలనే విషయాన్ని ఇంతవరకు తాము ఖరారు చేయలేదని తెలిపారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే బీసీసీఐ భేటీ అవుతుందని చెప్పారు. జూనియర్ జట్టుకు వెంకటేష్ ప్రసాద్ చేసిన సేవలు అమోఘమని కొనియాడిన ఖన్నా… రానున్న రోజుల్లో కూడా జూనియర్ జట్టు ఘన విజయాలు సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ప్రసాద్ చైర్మెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూనియర్ జట్లు (అండర్-19, భారత్-ఏ) అద్బుత ప్రదర్శన కనబర్చాయి. దీంతో అప్పట్లో ఆయనకు సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ జూనియర్ ప్యానెల్లోనే కొనసాగించింది. ఇక జాతీయ సెలక్టర్లుగా ఉన్న ఆరుగురి సభ్యుల్లో(ముగ్గురు జూనియర్, ముగ్గురు సీనియర్) వెంకటేశ్ ప్రసాదే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఆయన తన కెరీర్లో 33 టెస్టులు, 161 వన్డేలాడారు.