బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా నాలుగు పేసర్లతోనే బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధృవీకరించారు. బ్రిస్బేన్లో జరిగిన రెండో అషెస్ టెస్టులో ఫ్రంట్లైన్ స్పిన్నర్ లేకుండానే ఆడిన ఆస్ట్రేలియా, అదే వ్యూహాన్ని ఇప్పుడు మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్టులో కూడా కొనసాగించనుంది. గాయంతో నాథన్ లయన్ జట్టుకు దూరం కాగా, అతని స్థానంలో భావించిన టాడ్ మర్ఫీకి కూడా తుది జట్టులో అవకాశం దక్కలేదు. దీంతో నాలుగు ఫాస్ట్ బౌలర్లతోనే ఆస్ట్రేలియా ఆడనుంది.
మేము 12 మందితో కూడిన స్క్వాడ్ను ఎంపిక చేసుకున్నాం. రేపు పిచ్ను మరోసారి పరిశీలిస్తాం. కానీ స్పిన్నర్ లేకుండా నాలుగు పేసర్లతోనే ఆడబోతున్నాం అని స్మిత్ వెల్లడించారు. టెస్టుకు ఒక రోజు ముందు పిచ్ను చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. “పిచ్పై సుమారు 10 మిల్లీమీటర్ల గడ్డి ఉంది. చాలా గ్రీన్గా, తడిగా ఉంది అని స్మిత్ వివరించారు.
వాతావరణ పరిస్థితులు కూడా పేసర్లకు అనుకూలంగా ఉంటాయని అంచనా. తొలి మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26 డిగ్రీల వరకు మాత్రమే ఉండనున్నాయి. చలితో పాటు మబ్బులు కమ్ముకునే అవకాశముండటంతో పిచ్పై బంతికి మంచి మూవ్మెంట్ లభిస్తుందని స్మిత్ అన్నారు.
టాడ్ మర్ఫీని పక్కన పెట్టడం అతని నైపుణ్యాల కారణంగా కాదని స్మిత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం ఆడుతున్న చాలా పిచ్లు స్పిన్ కంటే సీమ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్నాయి. అడిలైడ్ టెస్టు మాత్రం భిన్నం. అక్కడ నాథన్ లయన్ కీలక పాత్ర పోషించాడు. కానీ ఇక్కడ పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉన్నాయి. నాథన్ లయన్ అందుబాటులో ఉన్నా కూడా ఇదే నిర్ణయం తీసుకునేవాళ్లం అన్నారు.
ఇదే సమయంలో జై రిచర్డ్సన్ తిరిగి జట్టులోకి రావడంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశారు. గాయాల కారణంగా దీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన రిచర్డ్సన్కు అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయని తెలిపారు. క్యామరూన్ గ్రీన్పై కూడా స్మిత్ విశ్వాసం వ్యక్తం చేస్తూ, బ్యాట్, బాల్, ఫీల్డింగ్లో అతను కీలకంగా మారతాడని చెప్పారు.
అడిలైడ్ టెస్టును వెస్టిబ్యులర్ సమస్యతో మిస్ అయిన స్మిత్, ఇప్పుడు పూర్తిగా ఫిట్గా ఉన్నానని, బాక్సింగ్ డే టెస్టుకు 100 శాతం సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
